కాపాడాల్సినోడే కాల్చిచంపాడు

17 Aug, 2019 05:40 IST|Sakshi
వ్యాపారవేత్త భార్య నిఖిత, కుమారుడు ఆర్య (ఫైల్‌)

తల్లిదండ్రులు, భార్య, కొడుకుపై తూటా  

తనూ కాల్చుకుని వ్యాపారవేత్త బలవన్మరణం  

మైసూరు కుటుంబం చామరాజ

నగర జిల్లాలో మృత్యువాత

తల్లిదండ్రులకు, కట్టుకున్నామెకు కష్టమొస్తే అండగా ఉండి జీవితం పంచాల్సిన వ్యక్తి ఏవో కారణాలకు కసాయిగా మారిపోయాడు. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందన్న విచక్షణ మరచి తుపాకీకి బలిచ్చాడు. అతడు తుపాకీ తీయగానే వృద్ధ తల్లిదండ్రులు, భార్య, కొడుకు ఎంత విలవిలలాడి ఉంటారో? వ్యాపారంలో నష్టాలనే  కారణంతోరక్తపాతానికి ఒడిగట్టాడు.  

సాక్షి, బెంగళూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె వద్ద శుక్రవారం ఉదయం ఘోర విషాదం వెలుగుచూసింది. మైసూరుకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులను పిస్టల్‌తో చంపి తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు, అప్పుల భారమే కారణమని  పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఘటనా స్థలంలోఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించకపోవడంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు జిల్లా ఎస్పీ హెచ్‌డీ ఆనందకుమార్‌ తెలిపారు. 

వ్యాపారంలో రాణించి..  
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు చెందిన నాగరాజ భట్టాచార్య తనయుడు ఓంకార్‌ప్రసాద్‌ (38) మైసూరులో స్థిరపడ్డాడు.  ఐటీ, స్థిరాస్థి, గనులు తదితర వ్యాపారాలు సాగించిన ఓంకార్‌ దండిగా ఆర్జించాడు. అయితే కొంతకాలంగా వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో దిక్కుతోచలేదు. తాను చనిపోతే కుటుంబసభ్యులు దిక్కులేని వాళ్లవుతారని భావించి వాళ్లని చంపి తాను చనిపోవాలనే నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సమీపంలో ఉండే గుండ్లుపేటెలో లాడ్జిలో కుటుంబంతో దిగాడు. గురువారం అర్ధరాత్రి దాటిన సమయంలో సమీపంలోని ఫాంహౌస్‌ వద్దకెళ్లారు. అక్కడ తల్లిదండ్రులు నాగరాజ భట్టాచార్య (65), తల్లి హేమ (60), భార్య నిఖిత (28), కొడుకు ఆర్య కృష్ణ(4) ను కాల్చి తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతసేపటికి వారి కారు డ్రైవర్‌ వచ్చి గమనించగా అందరూ రక్తపు మడుగులో పడి ఉన్నారు. తెల్లవారుజామున 3–4 గంటల సమయంలో సంఘటన జరిగి ఉంటుందని ఎస్పీ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంఘటనాస్థలంలో మృతదేహాలు
ఆ గన్‌ సెక్యూరిటీ గార్డుది   
డేటా బేస్‌ కంపెనీ నిర్వహిస్తున్న ఓంకార్‌ అలియాస్‌ ఓం ప్రకాశ్‌ నలుగురు గన్‌మెన్‌ల ను నియమించుకున్నాడు. రియల్‌ఎస్టేట్, నగదు లావాదేవీలతో రాజభోగం అనుభవించేవాడు. గన్‌మెన్‌గా ఉన్న మాజీ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ నాగరాజు వద్ద లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ ఉంది. టూర్‌కు వెళ్తున్నా, భద్రత కోసమని దానిని ఓంకార్‌ తీసుకున్నాడు. అందులో 12 బుల్లెట్లు ఉండగా.. ఆరు ఉపయోగించాడు. కుటుంబసభ్యులు న లుగురితో పాటు తాను కాల్చుకోగా.. మరో బుల్లెట్‌ను గాల్లోకి కాల్చినట్లు భావిస్తున్నారు. నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు అదన పు ఎస్పీ అనిత తెలిపారు.

>
మరిన్ని వార్తలు