నిన్న వేడుక.. నేడు లేడిక

22 May, 2018 10:08 IST|Sakshi
20వ తేదీన పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి కేక్‌ కట్‌ చేస్తూ.. (ఇన్‌సెట్‌) రమేష్‌ (ఫైల్‌)

ఏన్కూరులో విద్యావలంటీర్‌ ఆత్మహత్య

భార్య, అత్తే కారణమంటూ సూసైడ్‌ నోట్‌

ఖమ్మం,ఏన్కూరు: క్షణికావేశమో.. తీవ్ర మనస్థాపమో గానీ..ఆదివారం ఆనందంగా పెళ్లిరోజు సంబరం జరుపుకున్న ఓ యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఏన్కూరులో సోమవారం చోటు చేసుకుంది. గర్భిణి అయిన భార్యను, కన్నవారిని వీడి..తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..భగవాన్‌నాయక్‌ తండాకు చెందిన గుగులోతు రమేష్‌(33) జన్నారం పాఠశాలలో విద్యావలంటీర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది మాణుగూరుకు చెందిన అనూషతో వివాహం కాగా..కొన్ని రోజుల కిందట వీరిద్దరి మధ్య గొడవ జరిగి..ఆమె పుట్టింటికి వెళ్లింది.

రమేష్‌ ఈ నెల 19న మాణుగూరులో ఆమె వద్దకు వెళ్లి..20వ తేదీన ఇద్దరూ కలిసి కేక్‌ కట్‌చేసి పెళ్లిరోజు వేడుకను సంబరంగా జరుపుకున్నారు. తెల్లవారాక..రమేష్‌ ఒక్కడే భగవాన్‌నాయక్‌ తండా వచ్చాడు. ఇంట్లో కూర్చొని..తన చావుకు భార్య అనూష, అత్త విజయ కారణమని సూసైడ్‌ నోట్‌ రాసి.. ఏన్కూరు వచ్చాడు. పురుగులమందు డబ్బా కొని, పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని పామాయిల్‌ తోటలోకి వెళ్లి తాగి..ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఐదు నెలల గర్భిణి. వేధింపుల వలనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి బాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై తోట నాగరాజు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు