యువకుడి ఆత్మహత్యాయత్నం

17 Jul, 2018 12:14 IST|Sakshi
పురుగు మందు తాగి కలెక్టర్‌ ఎదుటే పడిపోయిన ప్రకాశ్‌

కలెక్టరేట్‌లో ఘటన

ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని దక్కకుండా చేస్తున్నారని బాధితుడి ఆవేదన

పరిస్థితి విషమం

కల్లూరు (రూరల్‌): ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకెళ్లడమే కాకుండా తనపై కిడ్నాప్‌ కేసు పెట్టారంటూ కర్నూలుకు చెందిన యువకుడు సోమవారం కలెక్టరేట్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలులోని బుధవారపేటకు చెందిన ప్రకాశ్‌ (30) అదే కాలనీకి చెందిన నర్సింగ్‌ విద్యార్థినిని ప్రేమించాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకోరనే భయంతో గత నెల 20న మంత్రాలయం వెళ్లి వివాహం చేసుకున్నారు. కొన్నిరోజులు విజయవాడ, తిరుపతి, శ్రీశైలంలో గడిపారు. ఇదే క్రమంలో తమ కూతురు కనిపించడం లేదని అమ్మాయి తల్లిదండ్రులు కర్నూలు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందుకు ప్రకాశ్‌ కారణమని, అతనిపై

కిడ్నాప్‌ కేసు నమోదు చేయాలని కోరారు. ఫిర్యాదు విషయం తెలుసుకున్న ప్రకాశ్, ఆ అమ్మాయితో కలిసి గత నెల 28న కర్నూలుకు వచ్చారు. అమ్మాయికి తల్లిదండ్రులు కౌన్సెలింగ్‌ ఇచ్చి ఇంటికి తీసుకెళ్లిపోయారు. ఇంటికెళ్లి ఐదురోజులు ఆలోచించుకుని ఏ విషయమూ చెబుతానని ఆమె ప్రకాశ్‌తో చెప్పి వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ పోలీసులను ఆశ్రయించి.. తన భార్యను అప్పగించాలని కోరాడు. కాస్త ఓపిక పట్టాలని పోలీసులు చెబుతూ వచ్చారు. పోలీసులతో తనకు న్యాయం జరగదని భావించిన ప్రకాశ్‌ సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో మీ కోసం (ప్రజాదర్బార్‌) కార్యక్రమం జరుగుతుండగా..అక్కడికొచ్చి క్రిమిసంహారక మందు తాగి కలెక్టర్‌  సత్యనారాయణ ఎదుట పడిపోయాడు. వెంటనే అధికారులు అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు