సరైన ఉద్యోగం లేదని ఆత్మహత్య

16 May, 2019 13:07 IST|Sakshi

పట్నంబజారు(గుంటూరు):    మంచి ఉద్యోగం లేదని ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. కొత్తపేట పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... రైలుపేటలోని ప్రతాపగిరి వారి వీధిలో నివాసం ఉండే తిరుమలశెట్టి అనిల్‌కుమార్‌ (37) లక్ష్మీపురంలోని విజేత సూపర్‌ మార్కెట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య చంద్రకళ, ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే తనను చిన్ననాటి నుంచి సరిగా పెంచలేదని, అందుకే చాలీచాలని చిన్నపాటి ఉద్యోగంలో బతుకు వెళ్లదీయాల్సివస్తోందంటూ మనోవేదన చెందుతూ ఉండేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారాడు.

ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లి వచ్చిన అనిల్‌కుమార్‌ మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో బెడ్‌రూములోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. అయితే మద్యం తాగి ఉన్న అతను నిద్రిస్తున్నాడని కుటుంబ సభ్యులు భావించారు. తెల్లవారి లేచి చూసే సరికి చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించగా కొత్తపేట ఎస్‌హెచ్‌వో మధుసూదనరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు