అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

14 Sep, 2019 08:14 IST|Sakshi

ప్రాణాంతక వ్యాధి బాధ భరించలేక యువకుడి ఆత్మహత్య 

సాక్షి, సోంపేట(శ్రీకాకుళం) : ‘నా భార్య పిల్లలను నీవే చూసుకోవాలి’ అని తన అన్నయ్య శ్రీనివాసరావుకు బాధాతప్తం హృదయంతో ఫోన్‌ చేసి మాట్లాడిన పలుకులే తమ్ముడు పిట్ట ఢిల్లీరావు(32)కు చివరివయ్యాయి. తన తలలో ఏర్పడిన కణితి బాధ భరించలేక, కుటుంబ సభ్యులకు భారం కాకూడదని నిర్ధారించుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోంపేట పట్టణంలోని తెలగవీధికి చెందిన ఈయన ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 

సోంపేట పోలీసుల వివరాల ప్రకారం... పట్టణంలో బైక్‌ మెకానిక్‌  షాపు నిర్వహిస్తున్న ఈయన తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తరచుగా తలనొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించారు. తలలో కణితి ఏర్పడిందని, ప్రమాదస్థాయిలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక తలనొప్పి తగ్గదని నిర్ధారించుకుని శుక్రవారం మధ్యాహ్నం 12 గంట ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని అరగంట ముందు హైద్రాబాద్‌లో ఉంటున్న తన అన్నయ్యకు సమాచారం అందించాడు. స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పెద్ద కుమారుడికి భోజనం క్యారేజ్‌ తీసుకెళ్లిన భార్య తేజేశ్వరికి విషయం తెలిసి బోరుమని రోదించింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ కే వెంకటేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు