మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

11 Jan, 2019 07:21 IST|Sakshi
లోకేష్‌ మృతదేహం

విజయనగరం, బొండపల్లి/ గజపతినగరం రూరల్‌ : మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం రాత్రి మండలంలోని బోడసింగిపేటలో జరిగింది. పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని జె. గుమడాం గ్రామానికి చెందిన పేలూరు లోకేష్‌ (20) విజయనగరం అయ్యన్నపేటకు చెందిన గురమ్మ (రోజా)ను 2018 అక్టోబర్‌ 14న ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్యతో కలిసి బోడసింగిపేట హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నాడు. లోకేష్‌ ఇంటి సీలింగ్‌ పనులు చేస్తుండగా... రోజా విజయనగరంలోని సెల్‌ఫోన్‌ దుకాణంలో పని చేస్తోంది. రెండు నెలలు సాఫీగా సాగిన వీరి కాపురంలో అనుమానాలు తలెత్తాయి.

భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన లోకేష్‌ ఉద్యోగం మానేయమని రోజాను కోరగా ఆమె నిరాకరించింది. ఇదిలా ఉంటే బుధవారం ఉదయం సహచర మిత్రులతో కలిసి లోకేష్‌ పనికి వెళ్లగా.. రోజా కూడా డ్యూటీకి వెళ్లిపోయింది. అయితే భార్య తన మాట వినలేదని మనస్తాపం చెందిన లోకేష్‌ సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందాడు. లోకేష్‌ తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు బొండపల్లి హెడ్‌కానిస్టేబుల్‌ డి. పైడితల్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గజపతినగరం సీహెచ్‌సీకి తరలించారు.

మరిన్ని వార్తలు