ఒడిశాలో ఆత్మహత్య చేసుకున్నయువకుడు

7 May, 2018 12:52 IST|Sakshi
షేక్‌ మదీన (ఫైల్‌ ఫొటో)

పెదవాల్తేరు(విశాఖ తూర్పు) : పెదజాలారిపేటకు చెందిన షేక్‌ మదీన (30) మరణం మిస్టరీగా మారింది. ఇంట్లోంచి వెళ్లిపోయిన మదీన ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో చెట్టుకి ఉరి వేసుకుని ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నట్టుగా శనివారం వాట్సాప్‌లో ఫొటోలు హల్‌చల్‌ చేశాయి. పెదజాలారిపేట బాపూజీనగర్‌లో తల్లిదండ్రులు, అన్నయ్య సుభానీతో కలిసి మదీనా నివసిస్తున్నారు.

వీరంతా మటన్‌ దుకాణం నడుపుతున్నారు. కొంతకాలంగా మానసిక వ్యాధితో మదీన బాధపడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. గతంలో కూడా ఇలా వెళ్లి రావడంతో అలాగే వస్తాడని కుటుంబ సభ్యులు భావించారు. ఇంతలో మృతి చెందాడని వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.

ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మదీనా మృతితో పెదజాలారిపేట కాలనీలో విషాదం నెలకొంది. రాయగడలో మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం ఆదివారం ఉదయం పెదజాలారిపేటకు తరలించారు. అనంతరం ఇక్కడి వాల్తేరు డిపో సమీపంలో గల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

పోస్టుమార్టం నివేదికలో ఆత్మహత్య చేసుకున్నాడని రాయగడ పోలీసులు తెలిపారని ఎంవీపీ పోలీసులు ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. మదీన కనిపించడం లేదని శనివారం అతని సోదరుడు సుభానీ ఫిర్యాదు చేయడంతో ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ సీఐ మళ్ల మహేశ్వరరావు పర్యవేక్షణలో ఎస్‌ఐ లక్ష్మణరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు