సాక్షి, తూర్పు గోదావరి : వివాహితతో కలిసి పరారవుతున్న ఓ వ్యక్తి.. అడ్డగించిన ఆమె తండ్రి గొంతుకోసి పరారయ్యాడు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాత ఊరికి చెందిన చింతపల్లి శేషారత్నం అనే వివాహిత తన కుమార్తెను స్కూలుకు పంపే క్రమంలో బస్సు క్లీనర్తో పరిచయమైంది. పరిచయం కాస్తా ప్రేమగామారింది. దీంతో ఆ ఇద్దరు ఎక్కడికైనా పారిపోయి బ్రతకాలని నిశ్చయించుకున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం అర్థరాత్రి శేషారత్నం ప్రియుడితో పరారయ్యేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన ఆమె తండ్రి వెంకటేశ్వరరావు, శేషారత్నాన్ని మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆమె ప్రియుడు.. వెంకటేశ్వరరావు గొంతు కోసి అక్కడినుంచి పరారయ్యాడు. గాయపడ్డ వెంకటేశ్వరరావును స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.