పండుగ వేళ విషాదం

19 Mar, 2018 01:07 IST|Sakshi

జనంపైకి దూసుకొచ్చిన ఎడ్ల బండి.. ఒకరి మృతి

దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం ఉగాది సందర్భంగా నిర్వహించిన ఎడ్ల బండ్ల ఊరేగింపులో విషాదం చోటు చేసుకుంది. బెదిరిన ఎడ్లు అదుపు తప్పి జనంపైకి దూసుకెళ్లగా, ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పండుగ సందర్భంగా స్థానిక శివరాంమందిర్‌ వద్ద ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఊరేగింపు నిర్వహించారు. బండ్లు వరుసగా ఆలయం చుట్టూ తిరుగుతున్నాయి.

జనం పెద్ద ఎత్తున ఎడ్ల బండ్లను తిలకించడానికి వచ్చారు. అదే సమయంలో వరుసలో చివర ఉన్న ఓ ఎడ్ల బండి అదుపు తప్పి జనంపైకి వెళ్లింది. ఒక్కసారిగా జనం పరుగులు తీశారు. అక్కడే ఉన్న బోరెడ్డి బాల్‌రెడ్డి (45) కింద పడగా తలపై నుంచి ఎడ్లబండి వెళ్లింది. దీంతో తల పగిలి తీవ్రంగా రక్తస్రావం కాగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. బాల్‌రెడ్డిని తొలుత స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా రక్తస్రావం ఆగలేదు. ఈ నేపథ్యంలో కామారెడ్డికి తరలించేందుకు యత్నిస్తుండగా, ఆయన అప్పటికే మృతి చెందాడు.

మరిన్ని వార్తలు