పలాసలో దారుణం: టాయిలెట్‌లో మృతదేహం 

7 May, 2020 08:27 IST|Sakshi
సంఘటనా స్థలం వద్ద క్లూస్‌ టీమ్, పోలీసులు

సాక్షి, కాశీబుగ్గ: పలాసలో కలకలం రేగింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని టాయిలెట్‌లో బుధవారం ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో పట్టణంలో భయాందోళనలు అలముకున్నాయి. మృతుడిని కవిటికి చెందిన పల్లి సాంబమూర్తి(40)గా పోలీసులు గుర్తించారు. పలాసలోనే చాలాకాలంగా చిన్న చి న్న పనులు చేసుకుంటూ అతడు కుటుంబానికి దూరంగా జీవనం సాగిస్తున్నాడు. మృతదేహం పడి ఉన్న తీరు, శరీరంపై గాయాలు, కాంప్లెక్స్‌ పరిసరాల్లోని ఆనవాళ్లను బట్టి అతడిని పాశవికంగా హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.    

కలాసీలు గుర్తించారు.. 
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బుధవారం ఉదయం కొందరు కలాసీలు టాయిలెట్‌కు వెళ్లగా.. ఒక గది లో మృతదేహం కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీసి ఆ సమీపంలో ఉన్న పోలీసులకు విషయం చెప్పారు. వారు ఎస్‌ఐ మధుకు సమాచారం అందించడంతో ఆయన సీఐ వేణుగోపాలరావు, క్రైమ్‌టీమ్‌లను సంప్రదించి అంతా కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. కొందరు ప్రైవేటు కూలీలతో మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతదేహం రక్తపు మడుగులో ఉండడం, శరీరంపై తీవ్రమైన గాయాలు ఉండడంతో హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

అడుగడుగునా.. 
కాంప్లెక్స్‌లో శవం బయట పడిందన్న విషయం తెలిసి పలాస–కాశీబుగ్గ వాసులు ఆందోళనకు గురయ్యారు. మృతదేహం పడి ఉన్న తీరు, అతడి శరీరంపై గాయాలు పరిశీలనగా చూస్తే తీవ్ర పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ ఉన్న పాన్‌షాప్‌ తలుపులకు, కింది గచ్చుభాగానికి రక్త పు మరకలు అంటి ఉన్నాయి. చెప్పులు చెల్లాచెదురుగా పడి ఉండగా.. కాంప్లెక్స్‌లో బస్‌ పాసులిచ్చే ద్వారం వద్దకు వ్యక్తిని ఈడ్చుకువెళ్లిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. మృతదేహాన్ని పోలీసులు చూసే సరికి.. పురుషాంగంతో పాటు ఆపైభాగం, కింది భాగాల్లో తీవ్రమైన గాయాలు కనిపించాయి. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేనప్పుడు దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమా ర్టం జరిగితే మరిన్ని విషయాలు బయటపడతా యని చెబుతున్నారు.   

దర్యాప్తులోనే..   
ఈ సంఘటనపై కాశీబుగ్గ పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. మృతుడు కవిటికి చెందిన పల్లి ఫకీరు(లేటు) తల్లి జోగమ్మల చిన్న కుమారుడని, వివాహం కాలేదని తెలిపారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.  

ఎదురుగానే సీసీ కెమెరాలు.. 
మృతదేహం లభ్యమైన స్థలానికి కాసింత దూరంలోనే సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ కెమెరాల్లో దృశ్యాలు, వీడియోలు ఉంటా యని పోలీసులు భావిస్తున్నారు. రక్తపు మరకలు ఉన్న కాంప్లెక్స్‌ నీటి కుళాయికి ఎదురుగా కూడా ఓ సీసీ కెమెరా ఉంది. మృతుడి జేబులో ఉన్న కాగితాల ఆధారంగా అతడి వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు