‘కరెంట్‌’తో చేపల వేట.. షాక్‌తో మృతి

18 Jun, 2018 10:41 IST|Sakshi
ప్రవీణ్‌ కుమార్‌(22) మృతదేహం 

పటాన్‌చెరు టౌన్‌ : విద్యుత్‌ తీగలను నీటి గుంతలో వేసి చేపలు పట్టేందుకు యత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్టారెడ్డి కథనం ప్రకారం.. మండల పరిధిలోని పోచారం పరిధిలోని గణపతి గూడెంకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌(22) ఓ ప్రైవేట్‌ పరిశ్రమలో ఉద్యోగం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు.

శనివారం సాయంత్రం ప్రవీణ్‌ కుమార్‌ అతని స్నేహితులు ఠాగుర్‌శివ, ఎర్దనూర్‌ ప్రశాంత్‌ పోచారం సమీపంలో ఉన్న ఈర్లమల్లన్న గుడి సమీపంలోని గుంతలో చేపలు పట్టడానికి వెళ్లారు. అక్కడ మద్యం సేవించారు. అనంతరం సమీపంలోని కరెంటు తీగలకు వైరు వేసి ఇంకో చివరను గుంతలో వేసి చాపలు పట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ప్రవీణ్‌ కుమార్‌ విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు.

గమనించిన స్నేహితులు ఠాగుర్‌ శివ, ప్రశాంత్‌ ప్రవీణ్‌ కుమార్‌ను పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందిన్నట్లు డాక్టర్‌ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు