స్నేహితుడిని రక్షించబోయి యువకుడి మృతి

27 Mar, 2019 12:55 IST|Sakshi
గౌరినాథ్‌ మృతదేహం 

నెల్లూరులో చోటుచేసుకున్న ఘటన

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): స్నేహితుడిని రక్షించబోయి యువకుడు నీటిలో మునిగి మృతిచెందిన ఘటన పెన్నానదిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నెల్లూరులోని జెండావీధికి చెందిన తంగరాజు గోల్డ్‌స్మిత్‌ వ్యాపారి. ఆయన కుమారుడు గౌరినాథ్‌ (17) సంతపేటలోని పీఎంఆర్‌ హైస్కూల్‌లో పదోతరగతి వరకు చదువుకున్నాడు. అదే స్కూల్‌లో గోపి సెంటర్‌కు చెందిన గణేష్‌ సైతం పదో తరగతి చదివాడు. ఇద్దరూ స్నేహితులు. గతేడాది జరిగిన 10వ తరగతి పరీక్షల్లో ఇద్దరూ మ్యాథ్స్‌ సబ్జెక్టులో ఫెయిలయ్యారు. ఈ ఏడాది పరీక్ష ఫీజు కట్టి మంగళవారం పరీక్ష రాసి ఇంటికి వెళ్లారు.

కొద్దిసేపటికి ఇద్దరూ కలిసి బైక్‌పై నగరంలో చక్కర్లు కొట్టారు. బహిర్బూమికి పెన్నావారధి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో గణేష్‌ ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన గౌరినాథ్‌ స్నేహితుడిని రక్షించే ప్రయత్నంలో తాను నీటిలో మునిగిపోయాడు. అటుగా వెళుతున్న వారు గుర్తించి గణేష్‌ను రక్షించగా గౌరినాథ్‌ నీటిలో మునిగి అప్పటికే చనిపోయాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న సంతపేట ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ కోటేశ్వరరావు, ఎస్సై సుబహానీలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో గౌరినా«థ్‌ మృతదేహాన్ని వెలికి తీయించారు. అతని వద్ద లభ్యమైన ఆధారాల మేరకు బాధిత కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని గౌరినా«థ్‌ విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పోలీసులు ప్రభుత్వ ప్రధానాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.    

మరిన్ని వార్తలు