వాలీబాల్‌ ఆడుతుండగా గుండెపోటు

25 Jul, 2018 13:11 IST|Sakshi
రవి కిరణ్‌ మృతదేహం 

అశ్వారావుపేటరూరల్‌ ఖమ్మం జిల్లా : ఓ విద్యార్థి, తన మిత్రులతో కలిసి వాలీబాల్‌ ఆడుతుండగా గుండెపోటు వచ్చింది... మృతిచెందాడు. అతడి స్నేహితులు, స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు... మండలంలోని మల్లాయిగూడేనికి చెందిన కణితి కృష్ణ–దుర్గ దంపతుల కుమారుడు రవి కిరణ్‌(16), సత్తుపల్లిలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

కుల ధ్రువీకరణ పత్రం కోసం కొద్ది రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం కుల ధ్రువీకరణ పత్రాన్ని తీసుకున్నాడు. కళాశాలకు వెళ్లేందుకని మంగళవారం ఉదయం బ్యాగ్‌ సిద్దం చేసుకున్నాడు. గ్రామంలోని యువకులు, స్నేహితులు కలిసి వాలీబాల్‌ ఆడుతుండగా చూశాడు.

తాను కుడా కొద్దిసేపు వాలీబాల్‌ ఆడిన తర్వాత కాలేజీకి వెళ్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఆట మధ్యలో సర్వీస్‌ చేసేందుకు బాల్‌ను కొడుతూ...ఒక్కసారిగా కుప్పకూలాడు. మిగతా ఆటగాళ్లంతా కలిసి తల్లిందండ్రులకు సమాచారమిచ్చి, ఆటోలో అశ్వారావుపేటలోని ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. అతడు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

కుటుంబీకులు గుండె పగిలేలా రోదిస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో తోటి ఆటగాళ్లంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు. రవి కిరణ్, పది రోజుల కిందట అస్వస్థుడయ్యాడు. విజయవాడ ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకెళ్లారు. గుండె సంబంధ వ్యాధి ఉన్నట్టుగా అక్కడి వైద్యులు చెప్పారు. వాలీబాల్‌ ఆడుతుండగా గుండెపోటు రావడంతో మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు