అందివచ్చిన కొడుకు అనంత లోకాలకు

11 Aug, 2019 08:00 IST|Sakshi
మృతదేహాన్ని పరిశీలిస్తున్న లావేరు ఎస్‌ఐ     

విద్యుత్‌షాక్‌తో  యువకుడి మృతి 

చినమురపాకలో విషాదఛాయలు

సాక్షి, లావేరు(శ్రీకాకుళం) : మండలంలోని చినమురపాక గ్రామంలో శనివారం మధ్యాహ్నం విద్యుత్‌ షాక్‌తో మీసాల రమణ(20) మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చినమురపాక గ్రామానికి చెందిన మీసాల రమణ సొంత వ్యవసాయ పొలంలోని మోటారు స్వీచ్‌ ఆన్‌ చేయడానికి వెళ్లాడు. అప్పటికే బోర్డుకు విద్యుత్‌ సరపరా కావడంతో విద్యుత్‌షాక్‌ తగిలి కింద పడిపోయాడు. సమీపంలో ఉన్న పలువురు రైతులు వచ్చి చూడగా రమణ కొన ఊపిరితో ఉన్నాడు.

ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో గ్రామ సమీపంలోనే మృతి చెందాడు. ప్రమాద విషయాన్ని తెలుసుకుçన్న లావేరు పోలీసులు గ్రామానికి వెళ్లి ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. యువకుడు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు మీసాల సీతన్నాయుడు, సిరిపురపు అయ్యప్పలనాయుడు, మీసాల బానోజీరావు, డాక్టర్‌ మీసాల రమణ, వెంకటప్పలనాయుడుతో పాటు పలువురు శనివారం సాయంత్రం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

బోరున విలపించిన తల్లిదండ్రులు..
మీసాల ఆదినారాయణ, పాపమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన రమణ పెద్ద కుమారుడు. డిగ్రీ వరకు చదువుకున్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నాడు. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. అందివచ్చిన కొడుకు విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. అందరితో ఎంతో సన్నిహితంగా ఉండే రమణ విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంతో గ్రామస్తులు, యువకులు విచారం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు