ప్రాణం తీసిన గాలిదుమారం

2 May, 2018 08:46 IST|Sakshi
ఆటో డ్రైవర్‌ మురళి మృతదేహం

జూలూరుపాడు : గాలిదుమారం.. ఒకరి ప్రాణాన్ని బలిగొంది. జూలూరుపాడులో గాలిదుమారం కారణంగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది, డ్రైవర్‌ మృతిచెందాడు. ఒకరికి గాయాలయ్యాయి. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ రాగం మురళి(25), తన ఆటోలో తల్లాడకు చెందిన వ్యాపారి అనమోలు సర్వేశ్వరరావును ఎక్కించుకుని తల్లాడ నుంచి జూలూరుపాడు వస్తున్నాడు. జూలూరుపాడులోని శ్రీ షిర్డి సాయిబాబా మందిరం సమీపంలోకి రాగానే ఉధృతంగా గాలి దుమారం మొదలైంది.

ఆ ఆటో ఒక్కసారిగా గాలిలోకి లేచింది. రోడ్డుపై పల్టీలు కొడుతూ పక్కకు పడిపోయింది. రోడ్డు పక్కనున్న సిమెంట్‌ స్తంభాన్ని మురళి తల ఢీకొంది. అతడిని స్థానికులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మురళి అప్పటికే మృతిచెందినట్టు వైద్య సిబ్బంది చెప్పారు. ఇతడు అవివాహితుడు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వ్యాపారి సర్వేశ్వరరావును ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు