వివాహానికి వెళ్లి వస్తూ మృత్యు ఒడికి

19 Mar, 2019 14:51 IST|Sakshi
మురళి (ఫైల్‌)

సాక్షి, కమ్మర్‌పల్లి(బాల్కొండ): వివాహానికి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని బషీరాబాద్‌ కాడి చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో మోర్తాడ్‌ మండలం వడ్యాట్‌కు చెందిన పెండెం మురళి(66) మృతి చెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ మనోజ్‌కుమార్‌ కథనం ప్రకారం.. వడ్యాట్‌కు చెందిన మురళి ఆదివారం మధ్యాహ్నం తోటి కార్మికుడి కూతురు వివాహ కార్యక్రమానికి టీవీఎస్‌ ఎక్స్‌ఎల్‌ ద్విచక్ర వాహనంపై భీమ్‌గల్‌ వెళ్లాడు. అయితే, సాయంత్రానికి కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. మొబైల్‌కు ఫోన్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఆచూకీ కోసం వెతికారు.

సోమవారం ఉదయం రోడ్డు వెంబడి వెతుకుతూ వెళ్లగా కాడి చెరువు  సమీపంలో రోడ్డు పక్కన పొదల్లో వాహనం కనిపించింది. వెళ్లి చూడగా, పక్కనే మురళి శవమై కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. బషీరాబాద్‌ కాడి చెరువు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయి గుంతలో పడిపోయి ఉండడం, మురళికి ముఖం, నోటి దగ్గర, చాతీ భాగాల్లో గాయాలను బట్టి ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. మృతుడికి భార్య రాధ, కూతురు రమ ఉన్నారు.   

మరిన్ని వార్తలు