శ్రీవారి సేవకు వెళ్తుండగా రైలు ప్రమాదంలో భర్త మృతి
షాక్ గురై కుప్పకూలిన భార్య
విశాఖలో ప్రైవేటు ఆస్పత్రికి తరలింపు
సాక్షి, రావికమతం (చోడవరం): శ్రీవారి సేవకు వెళ్తూ విశాఖ రైల్వే స్టేషన్లో ప్రమాదవశాత్తు తిరుమల ఎక్స్ప్రెస్, ప్లాట్ఫారం మధ్యన పడి కొత్తకోట గ్రామానికి చెందిన జనపరెడ్డి రాజు(38) అనే వ్యక్తి మృతి చెందగా, కళ్లముందే భర్త మృతి చెందడంతో షాక్కు గురై అతని భార్య సొమ్మసిల్లి పడిపోయింది. కోమా స్టేజ్కు వెళ్లిపోవడంతో ఆమెను విశాఖలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తకోటలో కలం వీధిలో నివాసముంటున్న రాజు స్థానికంగా విస్తరాకుల మిషన్ నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య కల్యాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తిరుమలలో వేంకటేశ్వరస్వామి సేవకు గానూ కొత్తకోట నుంచి రాజు, అతని భార్య బుధవారం బయలుదేరారు. వీరితో పాటు బయలుదేరిన అనకాపల్లిలో ఉంటున్న రాజు తోడల్లుడు, మరో 12 మంది మహిళలు విశాఖలో రైలు ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
20 రోజుల కిందటే తిరుపతి వెళ్లొచ్చి...
రాజు భార్య కల్యాణి తిరుమల శ్రీవారి సేవకు ఏటా వెళ్తుంది. 20 రోజుల కిందటే దంపతులిద్దరూ తిరుపతి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అయితే అనుకోకుండా శ్రీవారి సేవకు అతని తోడల్లుడి ద్వారా అవకాశం లభించడంతో మళ్లీ బుధవారం తిరుమల బయలుదేరారు. రాజు రైలు కింద పడిపోవడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు.
కన్నీరుమున్నీరుగా...
కొత్తకోట గ్రామంలో విస్తళ్ల మిషన్ నిర్వహిస్తున్న రాజు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఉదయం విశాఖ వెళ్లిన రాజు మధ్యాహ్నం మృతి చెందినట్టు సమాచారం రావడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు రాజు వద్ద పనిచేసే పలువురు కన్నీరు మున్నీరుగా విలపించారు. అందరితో సరదాగా ఉండే రాజు ఇక లేడంటే వారంతా జీర్ణించుకోలేకపోతున్నారు.