గోదావరిలో స్నానానికి దిగి యువకుడి మృతి

26 Jun, 2019 08:24 IST|Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి) : గోదావరిలో స్నానానికి దిగి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. త్రీటౌన్‌ సీఐ శేఖర్‌ బాబు తెలిపిన వివరాల ప్రకారం వడ్లమూరు గ్రామానికి చెందిన పొన్నగంటి జయ దుర్గాప్రసాద్‌ (21) సూరం పాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్‌ కాలేజీలో 4వ సంవత్సరం ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం గతంలో డిప్లమో చదివే రోజుల్లో స్నేహితులైన ముప్పన ఈశ్వర సాయి, కురెళ్ల మధుతో కలసి రాజమహేంద్రవరం వచ్చారు. పుష్కర ఘాట్‌లో స్నానం చేసేందుకు ముగ్గురూ దిగారు.

 మధు, ఈశ్వర సాయిలకు ఈత రాకపోవడంతో ఒడ్డున మెట్ల మీద కూర్చొని ఉండగా దుర్గా ప్రసాద్‌ తనకు ఈత వచ్చునని గోదావరిలోకి దిగాడు. ప్రమాదవశాత్తు ప్రవాహానికి నదిలోకి కొట్టుకుపోయి మృతి చెందాడు. స్నేహితుడు కొట్టుకుపోతుండడం గమనించిన ఒడ్డున ఉన్న స్నేహితులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న త్రీటౌన్‌ ఎస్సై ఆదినారాయణ వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

మరిన్ని వార్తలు