తాంత్రికుడి కోరిక తీర్చలేదని భార్యను..

15 Jun, 2019 11:28 IST|Sakshi

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. తాంత్రికుడి మాయలో పడిన ఓ వ్యక్తి సొంత భార్యను హత్య చేశాడు. అలీగఢ్‌కు చెందిన మాన్‌పాల్ అనే వ్యక్తి సంత్‌దాస్‌ దుర్గాదాస్‌ అనే తాంత్రికుడి మాయలో పడి ఏం చెబితే అది చేసేవాడు. మూడనమ్మకాల పిచ్చితో ఇప్పటికే ఎంతో డబ్బులు అతడికి సమర్పించుకున్నాడు. మాన్‌పాల్ పూర్తిగా తన ఆధీనంలోకి వచ్చాడని నిర్ధారణ చేసుకున్న తాంత్రికుడు తన వక్రబుద్ధిని చూపెట్టాడు. ‘నీ భార్యతో ఓసారి గడపాలని ఉంది’ అంటూ మాన్‌పాల్‌తో చెప్పాడు. దీనికి ఏమాత్రం సంకోచించని అతడు భార్యకు ఈ విషయాన్ని చెప్పాడు. 

భర్త మాటలతో షాకైన ఆమె దీనికి ఒప్పుకోలేదు. దీంతో ఆమెను చంపేయాలని మాన్‌పాల్ నిర్ణయించుకున్నాడు. కుటుంబం వృద్ధి చెందాలంటే కొన్ని పూజలు చేయాలని మాయమాటలు చెప్పి భార్యను శుక్రవారం సమీపంలోని నది వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ తాంత్రికుడితో కలిసి భార్యను నీళ్లలో ముంచి ఊపిరాడకుండా చేసి హత్యచేశాడు. తన తల్లిని హత్య చేస్తుండగా చూసిన కుమారుడు గ్రామానికి వెళ్లి స్థానికులకు సమాచారమిచ్చాడు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకుని నిందితులిద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతురాలి సోదరుడు రాజేశ్‌కుమార్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తన తల్లిని కాపాడాలని ప్రయత్నించిన కుమారుడిని కూడా మాన్‌పాల్‌ చంపడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఇక సంత్‌దాస్‌ దుర్గాదాస్‌కు నేర చరిత్ర ఉందని, గతంలోనూ కొందరిని ఇలాగే మోసం చేసినట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు