మహిళను చంపి శవాన్ని సూట్‌కేస్‌లో కుక్కి..

26 May, 2020 20:14 IST|Sakshi

హరిద్వార్‌లో ఘాతుకం

డెహ్రాడూన్‌ : తనతో సహజీవనం చేస్తున్న మహిళను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి మరో మహిళతో పారిపోయిన బీహార్‌ వ్యక్తి ఉదంతం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బయట నుంచి తాళం వేసిన అపార్ట్‌మెంట్‌ నుంచి దుర్వాసన రావడంతో స్దానికులు పోలీసులకు సమాచారం అందించగా ఈ ఉదంతం బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్‌కు చెందిన బాధితురాలు (23), నిందితుడు (26) ఇద్దరూ హరిద్వార్‌లో ఒకే కంపెనీలో పనిచేస్తున్నారని పోలీసులు తెలిపారు

నిందితుడు బీహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన వాడని హరిద్వార్‌ ఎస్పీ కమలేష్‌ ఉపాథ్యాయ్‌ వెల్లడించారు. హతురాలు, నిందితుడికి ఎప్పటినుంచో పరిచయం ఉందని..గ్వాలియర్‌, ఢిల్లీలో ఒకేచోట కలిసి పనిచేసిన సమయంలో వీరి పరిచయం సహజీవనానికి దారితీసిందని చెప్పారు. గత ఏడాది డిసెంబర్‌లో వీరు గతంలో పనిచేసిన సంస్ధకు చెందిన సిబ్బందితో కలిసి హరిద్వార్‌లోని ఓ కంపెనీలో చేరారని, వారంతా కంపెనీ సమీపంలోనే నివసిస్తున్నారని వెల్లడించారు. హతురాలు, నిందితుడు కూడా ఆ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్న క్రమంలో నిందితుడు అదే భవనంలో మరో మహిళతో సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు.

చదవండి : ఇవాంకను ఆకట్టుకున్న జ్యోతి కథ

దీంతో హతురాలు, నిందితుడికి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని తెలిసిందని అన్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగడంతో నిందితుడు ఆగ్రహంతో మహిళ గొంతునులిమి మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి పారిపోయాడని చెప్పారు. అదే భవనంలో మరో మహిళ ఆచూకీ గల్లంతవడంతో నిందితుడితో కలిసి ఆమె పారిపోయినట్టు తెలిసిందని వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశామని, పారిపోయిన ఇద్దరినీ త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ ఉపాధ్యాయ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు