జైపూర్ : లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి వేడుక నిర్వహించి, కరోనా వ్యాప్తికి కారణమైన ఓ వ్యక్తికి జిల్లా కలెక్టర్ దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చారు. 6 లక్షల రూపాయలకు పైగా ఫైన్ వేసి సరైన బుద్ధి చెప్పారు. ఈ సంఘటన రాజస్తాన్లోని బిల్వారాలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్, బిల్వారా జిల్లా బదాదా మొహల్లాకు చెందిన గిసులాల్ రతి అనే వ్యక్తి జూన్ 13న కుమారుడి వివాహ వేడుకను నిర్వహించాడు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ఈ వేడుకకు 50 మందికిపైగా బంధువులను పిలిచాడు. కొద్దిరోజుల తర్వాత పెళ్లికి హాజరైన 15 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. (కేర్ టేకర్తో సన్నిహితంగా ఉన్నాడని..)
వీరిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దీంతో గిసులాల్పై అధికారులు కేసు నమోదు చేశారు. అయితే బాధితుల చికిత్స కోసం ఐసోలేషన్ ఏర్పాటు, క్వారంటైన్, టెస్టులు, ఆహారం, అంబులెన్స్ ఖర్చుల కోసం ప్రభుత్వానికి దాదాపు 6,26,600 రూపాయలు ఖర్చయింది. ఈ మొత్తాన్ని సదరు గిసులాల్ కుటుంబం సీఎం రిలీఫ్ ఫండ్కు చెల్లించాలని జిల్లా కలెక్టర్ రాజేంద్ర భట్ ఆదేశించారు.