బావ ఆటోకు నిప్పు పెట్టిన వ్యక్తి

17 Apr, 2018 08:07 IST|Sakshi

కాపురం చక్కగా చేసుకోమని మందలించినందుకు..

అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ సెంట్రల్‌) : భార్యను వేధించకుండా కాపు రం చక్కగా చేసుకోమని మందలించాడనే కోపంతో ఓ వ్యక్తి తన బావ ఆటోకే నిప్పు పెట్టిన ఘటన కండ్రిక ప్రాంతంలో చోటు చేసుకుంది. నున్న రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కండ్రిక కాలనీకి చెందిన చిందిపిల్లి సింహాచలం (44) ఆటో డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. తన చెల్లెలికి వాంబే కాలనీకి చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే మల్లేశ్వరరావు తరచూ భార్యతో గొడవపడడం, ఆమెను తిట్టడం, కొట్టడం చేస్తుండడంతో సింహాచలం అతన్ని పలుమార్లు మందలిస్తూ వచ్చాడు.

దీంతో సింహాచలంను మల్లేశ్వరరావు కూడా బెదిరించడం ప్రారంభించాడు. ఆదివారం కూడా ఇదే విధంగా తన చెల్లిని వేధిస్తున్నాడని తెలియడంతో సింహాచలం వెళ్లి గట్టిగా మల్లేశ్వరరావును మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకున్న మల్లేశ్వరరావు ఆదివారం రాత్రి కండ్రిక కాలనీలోని సింహాచలం ఇంటికి వెళ్లి ఇంటి ముందు నిలిపిన ఆటోపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా తుళ్లిపడి నిద్రలేచిన స్థానికులు మంటలను అదుపు చేశారు. బాధితుడు సింహాచలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు