ఆధారాలు అడిగితే అంటించేశాడు !

24 Jul, 2018 09:13 IST|Sakshi
బైక్‌ను తగలబెట్టిన దృశ్యం

బైక్‌ను తగలబెట్టిన చోదకుడు

దొడ్డబళ్లాపురం : పోలీసులు దాఖలు పత్రాలు లేని బైక్‌ను పట్టుకుని సీజ్‌ చేసి స్వాధీనం చేసుకున్నందుకు ఆగ్రహించిన బైక్‌ చోదకుడు సదరు బైక్‌కు నిప్పంటించిన సంఘటన కలబుర్గి పట్టణంలో చోటుచేసుకుంది. కలబుర్గి పట్టణం పాతజీవర్గి రోడ్డులోని మోహన్‌ లాడ్జి వద్ద ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను నిలిపి దాఖలాలు పరిశీలించే క్రమంలో కేఏ–32,వీ–5089 నంబరు బైక్‌ను అడ్డగించి దాఖలు పత్రాలు అడిగారు. అయితే బైక్‌చోదకుడు తగిన దాఖలు పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు బైక్‌ను స్వాధీనం చేసుకుని తీసుకువెళ్తుండగా బైక్‌ చోదకుడు వెనుకనే వచ్చి బైక్‌ పెట్రోల్‌ పైప్‌ కోసి నిప్పంటించి పరారయ్యాడు. ఈ చర్యతో పోలీసులతోపాటు స్థానికులు అవాక్కయ్యారు. బైక్‌ చోరీ చేసి ఉండవచ్చని, అందుకే పట్టుబడతాననే భయంతో బైక్‌ను నిప్పంటించి పరారై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సంఘటనకు సంబంధించి ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు