సాక్షి, హైదరాబాద్ : విమానాశ్రయంలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన యువకుడిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ అనే యువకుడు శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులకు రూ. 30 లక్షలు టోకరా వేశాడు. నకిలీ గుర్తింపు కార్టు తయారు చేసి సుమారు 30 మందికి పైగా వ్యక్తుల వద్దనుంచి.. ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల చొప్పున వసూలు చేశాడు. రోజులు గడుస్తున్నా సంతోష్ వద్దనుంచి పిలుపు రాకపోవటంతో బాధితులు తాము మోసపోయామని గుర్తించారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు సంతోష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.