సెల్‌ పేలి యువకుడికి గాయాలు

30 Jan, 2020 08:58 IST|Sakshi
చికిత్స పొందుతున్న వెంకటేశన్‌

వేలూరు: వాలాజలో సెల్‌ఫోన్‌ పేలి ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సంచలనం రేపింది. నేతాజీ వీధికి చెందిన వెంకటేశన్‌(32) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వెంకటేశన్‌ ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో అతని సెల్‌కు ఇతర దేశానికి చెందిన నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. ఫోన్‌ ఆన్‌ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో వెంకటేశన్‌ తల, చెయ్యి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే వాలాజలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇతర దేశానికి చెందిన నంబర్‌ నుంచి కాల్‌ రావడంతో ఎందుకు పేలింది అనే కోణంలో పోలీసులు  విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాణిపేట డీఎస్పీ గీత తీవ్ర గాయాలైన వెంకటేశన్‌ వద్ద విచారణ చేపట్టారు. ముందు సెల్‌ఫోన్‌ పేలిందని.. మరోసారి ఇంటి సమీపంలోని చెత్తకు నిప్పు పెడుతుంటే అందులో ఉన్న గుర్తు తెలియని వస్తువు పేలిందని సమాధానం చెప్పాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు