తమ్ముడి చేతిలో అన్న హతం

17 Jun, 2018 08:18 IST|Sakshi
సల్లారం సత్తిరెడ్డి మృతదేహం 

సిరిసిల్లరూరల్‌ : మానవ సంబంధాలు మంట గలుస్తున్నాయి. విచక్షణ కోల్పోయి.. క్షణికావేశంలో తోబుట్టవుల ప్రాణాలు తీస్తున్నారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ గ్రామానికి చెందిన సల్లా రం సత్తిరెడ్డి(55) వరుసకు తమ్ముడైన రాంరెడ్డి చేతిలో హత్యకు గురయ్యాడు. పొయ్యి ల కట్టెల వివాదం ప్రాణం తీసింది. ఈ ఘట న తంగళ్లపల్లి మండలంలో సంచలనం సృష్టించింది.  

పోలీసుల వివరాల ప్రకారం.. 
అంకుసాపూర్‌ గ్రామానికి చెందిన సల్లారం సత్తిరెడ్డి, చిన్నాన కొడుకైన సల్లారం రాంరెడ్డికి కొంతకాలంగా అరగుంట వంటగది స్థలవివాదం కొనసాగుతోంది. శనివారం సారంపల్లి నుంచి ట్రాక్టర్‌లో సత్తిరెడ్డి–సులోచన దంపతులు వంటచెరకు తీసుకొచ్చారు. రాంరెడ్డి ఇంటిని ఆనుకొని ఉన్న స్థలంలో వేయడానికి ప్రయత్నించారు. దీనికి రాంరెడ్డి ఒప్పుకోలేదు. మరోచోట వేయాలని సూచించాడు. దీంతో మాటా మాట పెరిగింది. క్షణికావేశంలో రాంరెడ్డి పక్కనే ఉన్న కర్రతో సత్తిరెడ్డి తలపై బలంగా బాదాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావం అయ్యి.. సత్తిరెడ్డి కుప్పకూలిపోయాడు. అడ్డుగా వెళ్లిన సత్తిరెడ్డి భార్య సులోచనపై కూడా దాడి చేశాడు. సులోచన తీవ్రంగా గాయపడింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు దంపతులను మొదట సిరిసిల్ల ఆస్పత్రికి, అక్కడి నుంచి కరీంనగర్‌కు తరలించారు. సత్తిరెడ్డి కరీంనగర్‌ వెళ్లే్ల లోపే ప్రాణాలు వదిలాడు. సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌ ,తంగళ్లపల్లి ఎస్సై మారుతి అంకుసాపూర్‌కు వెళ్లారు. ఘటనస్థలిలో విచారణ జరిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

పోస్టుమార్టం వద్ద ఉద్రిక్తత 
సిరిసిల్ల ప్రభుత్వాస్పత్రిలో సత్తిరెడ్డి పోస్టుమార్టం వద్ద ఉత్రిక్తత నెలకొంది. సత్తిరెడ్డి కుటుంబ సభ్యులు ఎస్సై మారుతితో వాగ్వాదానికి దిగారు. తమ తండ్రిని చంపిన రాంరెడ్డిని అప్పగించాలని  తామూ నిందితుడిని చంపుతామని పేర్కొన్నారు. రాంరెడ్డికి చట్టరీత్యా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సిరిసిల్ల రూరల్‌ సీఐ అనిల్‌కుమార్‌ తెలపడంతో శాంతించారు.  

మరిన్ని వార్తలు