మరిది చేతిలో వదిన హతం

1 Feb, 2020 13:09 IST|Sakshi
మరిది చేతిలో హతమైన మారెమ్మ

ఆర్థిక లావాదేవీలే కారణం  

పాలకొల్లు అర్బన్‌: ఆర్థిక లావాదేవీల కారణంగా వదినను కత్తితో నరికి హతమార్చాడు ఓ వ్యక్తి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం లంకలకోడేరు శివారు వెదుళ్లపాలెంలో జరిగింది.  పాలకొల్లు రూరల్‌ ఎస్సై పి.తులసీరావు కథనం ప్రకారం.. లంకలకోడేరు శివారు వెదుళ్లపాలెంలో మడికి చల్లాలు, కుటుంబరావు అన్నదమ్ములు. చల్లాలు భార్య మారెమ్మ (45) గల్ఫ్‌ వెళ్లింది. అలాగే కుటుంబరావు, అతని భార్య కూడా గల్ఫ్‌ వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ  కలిసి వెదుళ్లపాలెంలో రెండు పోర్షన్ల కొత్త భవనం ఇటీవలే నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణ ఖర్చును అన్నదమ్ములిద్దరూ సమానంగా భరించాలని ఒప్పందం. 15 రోజుల క్రితమే మారెమ్మ గల్ఫ్‌ నుంచి రావడంతో మరిది కుటుంబరావు ఇంటి నిమిత్తం చేసిన ఖర్చుల లెక్కలు ఆరా తీశారు.

అయితే లెక్కలు తేలకపోవడంతోగ్రామ పెద్దల్లో కూర్చుని మాట్లాడుకుందామని వదిన మారెమ్మ చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన కుటుంబరావు కత్తి తీసుకుని తాను చెప్పినట్టు వింటావా లేక పెద్దల్లోకి వెళతావా అంటూ నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది.  కుటుంబరావు తన వెంట తెచ్చుకున్న కత్తితో మారెమ్మను విచక్షణారహితంగా నరకడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. మృతురాలు మారెమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. వారందరికీ వివాహాలయ్యాయి. గల్ఫ్‌ నుంచి మరియమ్మ వచ్చిన వెంటనే  కుమార్తెలు వేర్వేరు చోట్ల ఉండడంతో వారి ఇళ్లకు వెళ్లి గురువారమే వెదుళ్లపాలెం వచ్చిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అన్యాయంగా తన భార్యను చంపేశాడు.. నా పిల్లలకు దిక్కెవరంటూ మారెమ్మ భర్త చల్లాలు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉండగా మారెమ్మను కుటుంబరావు తరచూ లైంగికంగా కూడా వేధించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు