సిగరెట్‌ తాగొద్దన్నాడని..చంపేశారు!

17 Oct, 2017 01:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంట్లో సిగరెట్‌ తాగవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి(22)ని అతని స్నేహితుడే కాల్చిచంపిన దారుణ ఘటన దేశరాజధానిలో చోటుచేసుకుంది. దక్షిణ ఢిల్లీలోని సుఖదేవ్‌ నగర్‌లో నివాసముంటున్న బ్రిజేశ్‌ కుమార్‌ ఈ నెల 9న తన స్నేహితుడు భోలాను పార్టీకి ఆహ్వానించాడు. అయితే తన తండ్రికి అలర్జీ ఉన్నందున ఇంట్లో సిగరెట్‌ కాల్చవద్దని కుమార్‌ సూచించాడు. దీంతో ఇరువురికి మాటామాట పెరగడంతో కుమార్‌ భోలాపై చేయిచేసుకున్నాడు.

దీన్ని అవమానంగా భావించిన అతను..కుమార్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం విజయ్, అరుణ్‌ అనే ఇద్దరు స్నేహితుల సాయం తీసుకున్న భోలా.. కుమార్‌ను తర్వాతి రోజు పార్టీకి ఆహ్వానించాడు. అతని చేత పూటుగా మద్యం తాగించి, దూరంగా తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపాడు. అనంతరం శవాన్ని దగ్గర్లోని కాలువలో పడేసి ముగ్గురు ఇళ్లకు వెళ్లిపోయారు. సోమవారం రోహిణీ సెక్టార్‌లోని కాలువలో దొరికిన ఓ శవాన్ని కుమార్‌గా నిర్ధారించిన పోలీసులు, పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు