మిత్రుడిపై అనుమానం.. బండరాయితో బాది..

11 Jul, 2018 19:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పుణె : భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో మిత్రుడి తలపై బండరాయితో కొట్టి హత్యచేశాడో వ్యక్తి. ఈ సంఘటన సోమవారం మహరాష్ట్రలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పుణె జిల్లాకు చెందిన మందర్‌ షిండే, అదే ప్రాంతానికి చెందిన యోగేష్‌ హరిభౌ దోనే మంచి మిత్రులు. యోగేష్‌ తరుచూ మందర్‌ షిండేను ఎగతాళి చేస్తూ మాట్లాడేవాడు. ఓ రోజు యోగేష్‌ అందరి ముందు మందర్‌ భార్య గురించి తప్పుగా మాట్లాడటంతో మందర్‌ అతనిపై కక్ష్య పెంచుకున్నాడు. యోగేష్‌ను మందు తాగటానికి పిలిచి మద్యం మత్తులో ఉండగా అతని తలపై పెద్ద బండరాయితో మోది హత్య చేశాడు.

ఈ హత్య చేయటానికి గణేష్‌ కవాలే, భూషణ్‌ గైక్వాడ్‌ అనే ఇద్దరి మిత్రుల సహాయం తీసుకున్నాడు. హత్య అనంతరం ఆ ముగ్గురు శవాన్ని పన్షత్‌ సమీపంలో పడవేశారు. మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేష్‌ కవాలేపై అనుమానంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. యోగేష్‌పై ఉన్న కోపంతోనే మందర్‌ అతన్ని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు