రూ.125 కోసం హత్య 

30 Nov, 2019 09:43 IST|Sakshi

సాక్షి, చెన్నై : కేవలం రూ.125 కోసం స్నేహితుడినే హతమార్చాడో కిరాతకుడు. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రం విరుదునగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. అరుప్పుకోటకు చెందిన రాబర్ట్‌ (40) విల్లుపురానికి చెందిన శివకుమార్‌ కట్టడ కార్మికులు. వీరిద్దరూ చెన్నై కేకేనగర్‌ అన్నా మెయిన్‌ రోడ్డులోని ప్లాట్‌ ఫాంపై ఉంటూ పనికి వెళ్లేవారు. బుధవారం రాత్రి మద్యం తాగుతున్న సమయంలో వీరి మధ్య గొడవ జరిగింది. శివకుమార్‌ వద్ద రాబర్ట్‌ కొద్ది రోజుల క్రితం రూ.250 అప్పు తీసుకున్నాడు. ఇందులో రూ.125 తిరిగి ఇచ్చినట్టు తెలిసింది. తక్కిన రూ.125 తిరిగి ఇవ్వమని శివకుమార్‌ రాబర్ట్‌తో బుధవారం రాత్రి గొడవ పడ్డాడు. ఆ సమయంలో రాబర్ట్‌ శివకుమార్‌ కుటుంబం గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఆగ్రహించిన శివకుమార్‌ బీర్‌బాటిల్‌ను పగులగొట్టి అతని తలపై తీవ్రంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన రాబర్ట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఫిర్యాదు అందుకున్న సహాయ కమిషనర్‌ రాధాకృష్ణన్, కేకే.నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ విచారణ చేసి శివకుమార్‌ను అరెస్టు చేశారు. 

పబ్జీగేమ్‌ ఆడొద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య 

అన్నానగర్‌: పబ్జీగేమ్‌ ఆడొద్దన్నందుకు విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన తిరువొత్తియూర్‌లో చర్చనీయాంశమైంది. తిరువొత్తియూరు కాలరింపేట చెట్టితోటమ్‌ ప్రాంతానికి చెందిన రఘుపతి వెల్డింగ్‌ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇతని కుమార్తె విద్యాశ్రీ (18). తిరువొత్తియూరు ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో బీఏ తమిళ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. విద్యాశ్రీ బుధవారం తన సెల్‌ఫోన్‌లో పబ్జీగేమ్‌ ఆడుతుండగా దాన్ని చూసి ఆమె తల్లి చదవకుండా గేమ్‌ ఆడుతున్నావేంటి..? అని మందలించింది. మనస్తాపానికి గురైన విద్యాశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు