కేక్‌ కట్‌ చేయించి..కసితీరా పొడిచారు!

29 Jul, 2019 08:19 IST|Sakshi

ముంబై : నమ్మిన స్నేహితులే ఓ యువకుడి పాలిట కాలయములయ్యారు. పుట్టినరోజు నాడే పాశవికంగా దాడి చేసి అతడిని హతమార్చారు. ఈ విషాదకర ఘటన ముంబైలోని ఘట్కోపర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు...నితేశ్‌ సావంత్‌(32) అనే వ్యక్తికి అతడి స్నేహితులకు వారం కిందట గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆ ఎనిమిది మంది మిత్రబృందం అతడితో మాట్లాడటం మానేశారు. అయితే ఆదివారం నితేశ్‌ పుట్టినరోజు కావడంతో అతడికి ఫోన్‌ చేశారు.

ఈ క్రమంలో ఘట్కోపర్‌లోని ఓ పార్కులో నితేశ్‌ బర్త్‌డే పార్టీ ప్లాన్‌ చేశారు. కేక్‌ కట్‌ చేసిన అనంతరం ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధాలతో అతడిని కసితీరా పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలో స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఏడు నుంచి ఎనిమిది మందికి ఈ హత్యతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిందితులతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న మరో ముగ్గురు వ్యక్తులను విచారిస్తున్నామని..త్వరలోనే నిందితుల ఆచూకీ కనుక్కుంటామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు