పాత కక్షలతో వ్యక్తి హత్య

30 Apr, 2019 11:37 IST|Sakshi

బొల్లారంలో ఘటన

కూతురునిచ్చి పెళ్లి చేయలేదని పగ పెంచుకున్న మేనల్లుడు

బండరాయితో తలపై మోదడంతో రక్తస్రావం

అక్కడికక్కడే మృతి చెందిన  మేనమామ

జిన్నారం(పటాన్‌చెరు) : పెళ్లి విషయంలో పాత కక్షలు పెంచుకొని  మేనల్లుడే మామను హత్య చేశాడు. ఈ సంఘటన జిన్నారం మండలం బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సోమవారం తెల్లవారు జామున జరిగింది. బొల్లారం సీఐ లక్ష్మారెడ్డి, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జిన్నారం మండలం బొల్లారం గ్రామ బీసీ కాలనీలో సాంతుల గోవిందు(55) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. స్థానికంగా రాళ్లు కొట్టుకుంటూ గోవిందు జీవనాన్ని సాగిస్తున్నాడు. చెల్లెలు కుమారుడు, మేనల్లుడైన సెల్వికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేస్తానని గతంలో గోవిందు చెప్పారు. కొన్ని కారణాల వల్ల గోవిందు తన కుమార్తెను సెల్వికి ఇచ్చి పెళ్లి చేయలేదు. ఈ సంఘటన జరిగి ఏడాది గడుస్తోంది. ఈ క్రమంలో సెల్వి తన మేనమామ గోవిందుపై అప్పటి నుంచి కక్ష పెంచుకున్నాడు. ఆదివారం రాత్రి గోవిందు తన భార్య కస్తూరి, కుమారుడు పెరుమాళ్లుతో కలిసి తను నివాసం ఉంటున్న ఇంటి  బయట నిద్రించాడు. తెల్లవారు జామున అతని కుమారుడు, భార్య ఇంట్లోకి వెళ్లి నిద్రించాడు. ఇంటి పక్కనే ఉంటున్న సెల్వి ఒంటరిగా గోవిందు నిద్రిస్తుండడాన్ని గమనించి బండరాయితో అతడి తలపై బాదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమైంది. బయట శబ్ధం రావడంతో భార్య కస్తూరి బయటకు వచ్చి చూసింది. అప్పటికే గోవిందు రక్తం మడుగులో ఉన్నాడు. ఆçసుపత్రికి తరలించేందుకు 108 వాహనాన్ని పిలిపించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. మృతుడి భార్య కస్తూరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ లక్ష్మారెడ్డి తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరిన్ని వార్తలు