భార్య, కూతురుకు నిప్పంటించిన భర్త 

19 Feb, 2019 13:16 IST|Sakshi
నిందితుడి చూపిస్తున్న సీఐ గురవయ్యగౌడ్‌   

ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి  

నిందితుడిని రిమాండుకు తరలించిన పోలీసులు 

కేసు వివరాలు వెల్లడించిన సీఐ గురవయ్యగౌడ్‌

చేవెళ్ల: భార్యాభర్తలు గొడవపడ్డారు.. ఆవేశానికి గురైన భర్త భార్య, ఏడాదిన్నర కూతురుపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన తల్లీకూతురును స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా ఆదివారం మృతిచెందారు. సోమవారం భర్త రాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ గురవయ్యగౌడ్‌ కేసు వివరాలు వెల్లడించారు. చేవెళ్ల మండల కేంంద్రంలోని అంగడిబజార్‌ కాలనీకి చెందిన ఎరుకల రాజు బాల్యం నుంచే చోరీలకు అలవాటుపడ్డాడు. ఈక్రమంలో పలుమార్లు జైలుకు సైతం వెళ్లొచ్చాడు. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇవ్వడంతో అతడు మారాడు. అనంతరం అదే కాలనీలో ఉండే దాసరి కాశమ్మ కుమార్తె రోజా(25)ను ప్రేమించి 5 ఏళ్ల క్రిత్రం వివాహం చేసుకున్నాడు.

దంపతులకు పిల్లలు శ్రావణ్‌(4), ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమార్తె కీర్తన ఉన్నారు. పెళ్లి తర్వాత రాజు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, కుటుంబం విషయంలో తరచూ దంపతులు గొడవపడేవారు. ఈక్రమంలో ఈనెల 14న రాత్రి ఇంట్లో రాజు, రోజా ఘర్షణపడ్డారు. ఎప్పుడూ గొడవపడుతున్నావని, తాను కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొని చనిపోతానని చెప్పింది. అప్పటికే ఆవేశంలో ఉన్న భర్త రాజు ‘నీవు  చనిపోతేనే నాకు మనఃశాంతి దొరుకుతుంది’ అని కిరోసిన్‌  తీసుకొని భార్య రోజా, పక్కనే ఉన్న కూతురు కీర్తనపై పోసి నిప్పంటించాడు. మంటల బాధ తాళలేక తల్లీకూతురు కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చి మంటలు ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు.

అయితే, అక్కడే ఉన్న రాజు తన భార్య రోజా వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని నమ్మించే ప్రయత్నం చేశాడు. అనంతరం తల్లీకూతురి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స కోసం వారిని నగరంలోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రోజా, ఆమె కూతురు కీర్తన ఆదివారం మృతిచెందారు. అనంతరం పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని విచారణ చేయగా.. ఆవేశంలో తన భార్యాకూతురిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించినట్లు అంగీకరించాడు. ఈమేరకు అతడి సీఐ గురువయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో సోమవారం రిమాండుకు తరలించారు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకు వెళ్లడంతో నాలుగేళ్ల బాలుడు శ్రావణ్‌ అనాథగా మారాడు.  

మరిన్ని వార్తలు