దాడి ఘటనలో వ్యక్తి మృతి

19 Nov, 2017 02:56 IST|Sakshi

చర్చి ఫాదర్‌పై లైంగిక వేధింపుల కేసు

కామారెడ్డి క్రైం: చర్చి ఫాదర్‌పై పెట్టిన లైంగిక వేధింపుల కేసును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు చేసిన దాడిలో బాధితుడు గుండెపోటుకు గురై మరణించాడు. ఈ ఘటన కామారెడ్డిలో శనివారం జరిగింది. నిజామాబాద్‌కు చెందిన వమ్య దేవసహాయం (42) కామారెడ్డి జిల్లా భిక్కనూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌. ఆయన భార్య మమత రామారెడ్డి పీహెచ్‌సీలో స్టాఫ్‌ నర్సు. వారు కామారెడ్డిలోని సీఎస్‌ఐ చర్చి కాంపౌండ్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వరుసకు బంధువైన సీఎస్‌ఐ చర్చి ఫాదర్‌ విల్సన్‌ తనను లైంగికంగా వేధిస్తున్నారని ఈనెల 4న మమత కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫాదర్‌ విల్సన్‌పై కేసు నమోదు చేశారు.

అయితే, కేసును వాపస్‌ తీసుకోవాలంటూ ఒత్తిళ్లు రావడంతో నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లి, శుక్రవారం సాయంత్రం తిరిగి వచ్చారు. విషయం తెలుసుకున్న దేవసహాయం సోదరులు సాల్మన్, శ్యాంసన్, ప్రసాద్, ప్రసాద్‌ భార్య కేజియా శనివారం వేకువజామున ఇంటికి వచ్చారు. కేసు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. దేవసహాయం నిరాకరించడంతో దాడి చేసి కొట్టి వెళ్లిపోయారు. ఈ క్రమంలో దేవసహాయం గుండెపోటుకు గురయ్యారు. ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ మరణించారు. దేవసహాయం మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మృతుడి బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. కామారెడ్డి డీఎస్పీ ప్రసన్నరాణి, పట్టణ ఎస్‌హెచ్‌వో శ్రీధర్‌కుమార్, ఎస్‌ఐ రవికుమార్‌లు సంఘటనపై విచారణ జరిపారు. 

మరిన్ని వార్తలు