ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

30 May, 2019 09:27 IST|Sakshi

సోమారం వాసి సిద్దిపేట జిల్లాలో హత్య

బండరాయితో కొట్టి చంపిన వైనం

నిందితుడి ఇల్లు దహనం చేసిన మృతుడి కుటుంబ సభ్యులు

సాక్షి, నిజామాబాద్‌ : తాడ్వాయి మండలంలోని సోమారం గ్రామానికి చెందిన పిట్ల గోపాల్‌(32)అనే వ్యక్తి సిద్దిపేట జిల్లాలోని గౌరారం పోలీసు స్టేషన్‌ పరిధిలోని నాచారంలో హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోపాల్, సంపంగి రవి వడ్డెర పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అంతేగాకుండ వీరిద్దరు కలసి చిన్నచిన్న దొంగతనాలు కూడా చేసేవారు. కాగా గత కొన్ని రోజుల నుంచి గోపాల్‌ భార్యతో రవి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ నెల 22న వీరిద్దరు ఇంటి నుంచి కామారెడ్డి వైపు వెళ్లారు. సిద్దిపేట శివారులో బండలను పగుల కొట్టాలని బేరం కుదుర్చకుందామని గోపాల్‌కు నచ్చచెప్పి రవి కామారెడ్డి నుంచి సిద్దిపేట జిల్లాలోని నాచారం చేరుకున్నారు. వారి వెంట తీసుకెళ్లిన మద్యం తాగారు.

ఈ క్రమంలో  గోపాల్‌కు మద్యం ఎక్కువ అయింది. ఇదే అదునుగా చూసుకొని రవి పెద్ద బండరాయితో గోపాల్‌ తలపై కొట్టాడు. దీంతో గోపాల్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ నెల 25న తన భర్త తప్పి పోయాడని గోపాల్‌ భార్య ఎల్లవ్వ తాడ్వాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. రవి చెప్పిన వివరాల ప్రకారం పోలీసులు నాచారంలోని ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న గోపాల్‌ కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి రవికి సంబంధించిన ఇల్లును దహనం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు సోమారం గ్రామానికి చేరుకొని బందోబస్తు ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అంజయ్య తెలిపారు. 

మరిన్ని వార్తలు