ఉసురు తీసిన వివాహేతర సంబంధం

30 Aug, 2018 13:56 IST|Sakshi
కుర్మన్న మృతదేహం   

కత్తితో పొడిచి వ్యక్తి దారుణ హత్య

సత్యవార్‌లో సంచలనం సృష్టించిన ఘటన

మక్తల్‌ : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. చివరికి ఆమెను కడతేర్చిన వ్యక్తిని భర్త దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన మండలంలోని సత్యవార్‌లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కుర్మన్న(45) అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సాకలి ఆంజనేయులు భార్య పద్మమ్మతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని ఆమెతో కలిసి హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడంతో కుర్మన్న పద్మమ్మను హతమార్చాడు.

ఈ ఘటనపై హైదరాబాద్‌లోని చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న కుర్మన్న నెల రోజుల క్రితం సత్యవార్‌లోని భార్య శంకరమ్మ దగ్గరికి వచ్చాడు. అయితే కుర్మన్నపై పగ పెంచుకున్న సాకలి ఆంజనేయులు అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో కుర్మన్న గ్రామ శివారులోకి వెళ్లిన విషయం తెలుసుకున్న ఆంజనేయులు అతనిపై దాడి చేసి కత్తితో పొడిచి హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. గ్రామంలో హత్య జరగడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు. కుర్మన్నకు భార్య శంకరమ్మ, ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.

మరిన్ని వార్తలు