-

వివాహితను ప్రేమ పేరుతో నమ్మించి..

23 Jul, 2019 12:29 IST|Sakshi

సాక్షి, చిత్తూరు : రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత శవమై తేలడం స్థానికంగా కలకలం రేపుతోంది. అయితే ఓ యువకుడు ప్రేమ పేరుతో ఆ మహిళను హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన జిల్లాలోని రామచంద్రపురం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పీవీ పురంకు చెందిన భానును పది సంవత్సరాల క్రితం.. రాయలచెరువుకు చెందని ముని శేఖర్‌తో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. శేఖర్‌ కొంత అమాయకుడు కావడంతో భాను రెండేళ్లుగా పుట్టింటిలోనే ఉంటున్నారు. శేఖర్‌ మాత్రం తరచూ భార్య వద్దకు వచ్చి వెళ్లేవాడు. అయితే ఇంటి వద్దే ఉంటున్న భానుకు అదే మండలంలోని రామాపురంకు చెందిన హరి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజులకే భాను కనిపించకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. 

దీంతో భాను తల్లిదండ్రులు రామచంద్రపురం పోలీసులను ఆశ్రయించారు. హరి మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు భానును హరి నమ్మించి హతమార్చినట్టు నిర్ధారించారు. రామచంద్రపురం వద్ద పాతిపెట్టిన భాను మృతదేహాన్ని వెలికి తీశారు. హరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన బిడ్డ శవంగా తేలడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపిస్తున్నారు. భాను కన్పించకుండా పోయినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని వారు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు