ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఒకరి హత్య

30 May, 2018 14:25 IST|Sakshi
మృతదేహం వద్ద రోదిస్తున్న భార్యాపిల్లలు  

మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా సరిహద్దు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా ఆశ్రిత్‌ గ్రామ అడవిలో గ్రామానికి చెందిన బుద్రమ్‌ పోడియ అనే వ్యక్తిని ఇన్‌ఫార్మర్‌ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. సోమవారం  కొంతమంది మావోయిస్టులు బుద్రమ్‌ ఇంటికి వచ్చి అతనిని తమ వెంట తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ప్రజా కోర్టు నిర్వహించి పోలీసులకు నీవు సహకరిస్తున్నావు, రోడ్డు పనులకు అనుకూలంగా సహాయం చేస్తున్నావని రుజువుకావడంతో హత్య చేస్తున్నామని  బుద్రమ్‌ను గొంతుకోసి చంపేశారు.

అనంతరం మృతదేహాన్ని గ్రామ శివారులో పడేసి, పక్కనే లేఖ కూడా వదిలి వెళ్లారు.  గ్రామస్తులు ఎవరైనా పోలీసులకు సహకరిస్తే వారికి కూడా ఇదే గతి పడుతుందని ఆ లేఖలో హెచ్చరించారు. మృతదేహాన్ని మంగళవారం గుర్తించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న తండ్రి, కొడుకు మృతదేహాన్ని భుజాలపై ఇంటికి తీసుకొచ్చారు. ఇంటిని పోషిస్తున్న పెద్ద దిక్కును మావోయిస్టులు చంపేయడంతో మాకు ఇక దిక్కు ఎవరని కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య, 12 సంవత్సరాల కుమారుడు ఉన్నారు.

మరిన్ని వార్తలు