సిగరెట్‌ కోసం తమ్ముడిని కడతేర్చాడు

22 Jul, 2018 11:48 IST|Sakshi

న్యూఢిల్లీ : తన మంచి కోరిన తమ్ముడిని కడతేర్చాడు ఓ అన్న. అంతేకాకుండా దాన్ని సహజ మరణంగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నించాడు. కానీ చివరకు పోలీసులు విచారణలో నిజం ఒప్పుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్‌ ఢిల్లీలో నివాసం ఉంటున్న శిశుపాల్‌ కుమార్‌కి విపరీతంగా సిగరెట్లు తాగే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్ల అతనితో పాటు ఇంట్లో వాళ్లకు కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తోంది. దీంతో అతని తమ్ముడు సత్యపాల్‌, ఆ అలవాటు మానుకోవాలంటూ శిశుపాల్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశాడు. అయిన శిశుపాల్ పట్టించుకోలేదు. గత కొన్ని నెలల నుంచి అన్నదమ్ముల మధ్య ఈ విషయంలో ఘర్షణ జరుగుతూనే ఉంది. కానీ బుధవారం వారిద్దరి మధ్య వాగ్యూద్ధం తార స్థాయికి చేరింది.

సత్యపాల్‌ తన అన్న చేత ధూమపానాన్ని విరమింపచేయాలని భావించాడు. తన తమ్ముడు తరచు తనకు అలా చెప్పడం నచ్చని శిశుపాల్‌ అతనిపై దాడికి ప్రయత్నించాడు. తన షూ లేస్‌ని సత్యపాల్‌ మెడకి గట్టిగా బిగించడంతో అతడు ప్రాణాలు కొల్పోయాడు. అయితే శిశుపాల్‌ దీన్ని సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సత్యపాల్‌ని ఆస్పత్రికి తరలించాడు. తన తండ్రికి తమ్ముడు అపస్మారక స్థితిలో ఉన్నాడనే సమాచారం ఇచ్చాడు. కానీ ఆస్పత్రి సిబ్బంది మాత్రం సత్యపాల్‌ మరణాన్ని అనుమానస్పద మృతిగా భావించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో అతను గొంతు నులిమి చంపబడ్డాడని తెలడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. శిశుపాల్‌పై అనుమానంతో గురువారం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చివరకు పోలీసుల విచారణలో శిశుపాల్‌ శనివారం తన నేరాన్ని అంగీకరించాడు. శిశుపాల్‌తోపాటు నలుగురు సోదరులు ఒకే ఇంట్లో ఉండేవాళ్లని అతని బార్య పోలీసులకు తెలిపారు. సత్యదేవ్‌కు మాత్రమే ఉద్యోగం లేదని.. అన్నదమ్ములు మధ్య చాలా రోజులుగా గొడవలు జరిగేవని.. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని అన్నారు.

మరిన్ని వార్తలు