సాక్షి, చెన్నై : సేలం కొండలాంపట్టి సమీపంలోని రైలు పట్టాలపై సుమారు 45 ఏళ్ల వయస్సు గల ఓ మహిళ మృతదేహం కనిపించింది. రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని ఆ మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న కొండలాంపట్టి పోలీసులు చేసిన విచారణలో ఆ మహిళ కొండలాంపట్టి మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన ముణియమ్మాల్ (48) అని తెలిసింది. ఈమె భర్త స్వామినాథన్. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయిన ముణియమ్మాల్ అదే ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సెంథిల్ కుమార్తో జీవిస్తూ వస్తోంది.
వీరిద్దరు కలిసి మద్యం తాగే వారని, ముణియమ్మాల్కు వేరొక వ్యక్తితో సంబంధం ఉన్నట్టుగాను, ఆ కారణంగా వారిద్దరు అప్పుడప్పుడు గొడవ పడేవారని తెలిసింది. ఈ స్థితిలో శుక్రవారం రాత్రి కూడా ముణియమ్మాల్తో సెంథిల్ కుమార్కు గొడవ ఏర్పడిందని, ఆ సమయంలో ఆవేశానికి గురైన సెంథిల్ కుమార్ కత్తితో ముణియమ్మాల్ గొంతు కోసి హత్య చేసి, తర్వాత ఆమె శవాన్ని రైల్వే పట్టాలపై పడవేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో పోలీసులు పరారీలో ఉన్న సెంథిల్ కుమార్ కోసం గాలిస్తున్నారు.