బంధువుల ఇంటికెళ్లిందని గర్భిణి భార్యను..

12 May, 2020 16:59 IST|Sakshi

ఢిల్లీలో దారుణం

సాక్షి, న్యూఢిల్లీ : చెప్పకుండా బంధువుల ఇంటికెళ్లిందనే కోపంతో గర్భిణి భార్యను గొంతు నులిమి చంపేశాడో కిరాతపు భర్త. ఈ ఘటన సౌత్‌ఢిల్లీ దక్షిణపురిలోని అంబేద్కర్‌ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణపూరికి చెందిన విజయ్‌ భార్య హేమలతతో కలిసి నివాసం ఉంటుంన్నాడు. 

హేమలత ఐదు నెలల గర్భిణి. కాగా శనివారం రోజు తన భర్తకు చెప్పకుండా ఆమె విజయ్‌ సోదరి ఇంటికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం విజయ్‌.. నిత్యావసర సరుకుల కోసం బయటకు వెళ్లాడు. అతను వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. ఆమె ఇంటికి తిరిగొచ్చాక.. విజయ్‌ కోపంతో ఊగిపోయాడు. తనకు చెప్పకుండా ఎందుకు వెళ్లావని ఆమెను ప్రశ్నిస్తూ గొడవకు దిగాడు. దీంతో ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ప్రాణాల మీదకు తెచ్చింది. సహనం కోల్పోయిన విజయ్‌.. సోమవారం తెల్లవారుజామున కట్టుకున్న భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత పోలీసుల ఎదుట విజయ్‌ లొంగిపోయాడు. తానే హేమలతను చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు