భార్య, ముగ్గురు పిల్లల్ని చంపి వాట్సాప్‌ గ్రూప్‌లో..

22 Apr, 2019 11:00 IST|Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. భార్య, ముగ్గురు పిల్లల్ని చంపి, ఆ వీడియోని వాట్సాప్‌ గ్రూప్‌లో పెట్టాడు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమిత్‌ కుమార్‌ ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అతని భార్య అన్షూబాల, ముగ్గురు పిల్లలతో కలిసి గజియబాద్‌కి సమీపంలో ఉన్న ఇందిరాపురంలో నివాసముంటున్నారు. భార్య అన్షూ బాల  సైకాలజీ టీచర్‌గా పని చేస్తుంది. కుమార్‌ కొద్ది నెలల క్రితం ఉద్యోగం మానేసి ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు.

భార్యభర్తల మధ్య తరచూ గొడవలు అయ్యేవి. శనివారం రాత్రి భార్యతో గొడవపడ్డ కుమార్‌.. అదే రోజు రాత్రి భార్య, ముగ్గురు పిల్లలను కిరాతంగా హత్య చేశాడు. నిద్రలో ఉన్న భార్య, పిల్లల్ని హత్య చేసి, వీడియో తీసి ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశాడు. వాట్సాప్‌ ద్వారా విషయం తెలుసుకున్న అన్షూ అన్నయ్య పంకజ్‌ సింగ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి ఇంటికి వెళ్లాడు. తలుపులు తెరచి చూడగా అన్షూ, ముగ్గురు పిల్లలు విగతజీవులుగా పడిఉన్నారు. పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టంకి తరలించారు. కాగా కుమార్‌ మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు సమాచారం. ఉద్యోగం పోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కుమర్‌.. ఆర్థిక విషయాలతో భార్యతో గొడవపడి హత్యలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పంకజ్‌ సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుమర్‌ని అరెస్ట్‌ చేశారు.

మరిన్ని వార్తలు