నాలుగేళ్ల క్రితం అత్యాచారం.. ఇప్పుడు హత్య!

16 Jul, 2020 14:12 IST|Sakshi

యూపీలో దారుణం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం మైనర్‌పై అకృత్యానికి పాల్పడిన ఓ దుర్మార్గుడు బెయిల్‌పై విడుదలై బాధితురాలి(17)ని, ఆమె తల్లిని హతమార్చాడు. కస్గంజ్‌ జిల్లాలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు... యశ్‌వీర్‌(30) అనే వ్యక్తి తన పొరుగింట్లో ఉండే బాధితురాలి కుటుంబంతో  సన్నిహితంగా మెలిగేవాడు.  వారితో కలివిడిగా ఉంటూ కుటుంబంలో ఒకడిగా మెదిలేవాడు. 

ఈ క్రమంలో 2016లో 13 ఏళ్ల బాలికైన బాధితురాలిని కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు. అయితే 2017లో బెయిల్‌పై బయటకు వచ్చిన యశ్‌వీర్‌ ఎలాగైనా బాధితురాలి కుటుంబంపై పగ తీర్చుకోవాలని భావించాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం సైకిలుపై ఇంటికి వస్తున్న తల్లీకూతుళ్లపై ట్రాక్టర్‌ ఎక్కించగా వారిద్దరు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతడిని అరెస్టు చేసి హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు.(టీవీ పెట్టమని అడిగినందుకు.. గొంతు కోసి చంపి!)

కాగా గత నాలుగేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య శత్రుత్వం ఉందని, పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారని పోలీసులు వెల్లడించారు. డబ్బు విషయంలో యశ్‌వీర్‌ తండ్రికి, బాధితురాలి తండ్రికి మధ్య జరిగిన గొడవలో నిందితుడి తండ్రి మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో యశ్‌వీర్‌.. బాధితురాలి తండ్రిపై ఫిర్యాదు చేయగా, అతడిని అరెస్టు చేశామని, 2018లో అతడు జైలు నుంచి విడుదలైనట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు