పిచ్చితల్లిని కాటేసిన కామాంధుడు 

8 Jul, 2019 10:02 IST|Sakshi

సిరిసిల్ల జిల్లా బోనాలలో దారుణం

బాత్రూంలోనే ప్రసవం.. పుట్టిన వెంటనే చనిపోయిన శిశువు

సాక్షి, సిరిసిల్ల : మానసిక స్థితి సరిగాలేని ఓ యువతిని లోబర్చుకుని గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. తనకు ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో దాదాపు 7 నెలలు తన కడుపులోనే శిశువు మోస్తూ చివరకు బాత్‌రూంలో ప్రసవానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పుట్టిన ఆడశిశువు వెంటనే మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాలలో ఆదివారం జరిగింది. చిన్నబోనాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగించే ఇండ్ల నర్సయ్య, వజ్రవ్వలకు 22 ఏళ్ల కూతురు ఉంది. చిన్ననాటి నుంచి ఆమె కాస్త మతిస్థిమితం లేనట్లు ఉండేదని స్థానికులు తెలిపారు. ఇంట్లోని వారందరూ కూలి పనులకు వెళ్లడం గమనించి స్థానికంగా ఉండే రాజు అనే వ్యక్తి ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి యువతిని లోబర్చుకున్నాడు.

ఇటీవల యువతికి ఆరోగ్యం బాగాలేకపోవడం, శారీరకంగా మార్పులు రావడంతో సిరిసిల్ల వెంకంపేటలోని ఓ ఆర్‌ఎంపీకి కుటుంబీకులు చూపించినట్లు స్థానికులు వివరించారు. యువతి శరీర ఆకృతిపై అనుమానం వచ్చిన చుట్టుపక్కల మహిళలు అడిగితే డాక్టర్‌ ఇచ్చిన మందులతో ఇలా జరిగిందని నిరాక్ష్యరాస్యులైన తల్లిదండ్రులు వివరించినట్లు తెలిసింది. కానీ ఆ యువతి గర్భందాల్చి దాదాపు ఏడు నెలల అవుతోందని, సమయం దగ్గరపడిన విషయం తెలియక యువతి బాతురూం వెళ్లిన క్రమంలో వచ్చిన నొప్పులకు కడుపులోని పాపను తానే బయటకు లాగినట్లు బాత్‌రూంలో ప్రసవించిన విధానాన్ని బట్టి మహిళలు వెల్లడించారు. యువతిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ గైనకాలజిస్ట్‌ లేకపోవడంతో ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని సిరిసిల్ల సీఐ శ్రీనివాస్, ఐసీడీఎస్‌ సిరిసిల్ల సీడీపీవో ఆలేఖ్య తెలిపారు.

మరిన్ని వార్తలు