నమ్మించి గొంతుకోశాడు..

15 Nov, 2019 07:46 IST|Sakshi

బావమరిదిని హతమార్చిన బావ

అక్కను చూసేందుకు వచ్చిన తమ్ముడు

బైక్‌పై తీసుకువెళ్లి ఘాతుకం

సాక్షి, ఆదిలాబాద్‌ : అక్కను చూసేందుకు వచ్చి బావ చేతిలో బావమరిది హతమైన సంఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని దహేలిలో నివాసముంటున్న నర్సమ్మ – దత్తుల కూతురు మమతను ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన ఓసావార్‌ సంతోష్‌తో పదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు చోటుచేసుకోగా అక్కతో కలిసి మనోజ్‌ (25) బావపై పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏడాది నుంచి అక్కాబావలు కలిసి ఉంటున్నారు. గురువారం తన అక్కను చూసేందుకు వచ్చాడు. అక్కతో పాటు ఆమె పిల్లలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. బావ సంతోష్‌ బావమరిదిని టీ తాగేందుకు ద్విచక్ర వాహనంపై బయటకు తీసుకువెళ్లాడు.

మమత జిన్నింగ్‌ ఫ్యాక్టరీ దగ్గరికి రాగానే బైక్‌ నడుపుతున్న మనోజ్‌ను కత్తితో వెనకనుంచి మెడను కోశాడు. ఆ తర్వాత కడుపులో పలుమార్లు పోడవడంతో మనోజ్‌ సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని అక్క కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు