కాపురానికి రాలేదని భార్యను..

7 Sep, 2019 08:14 IST|Sakshi

సాక్షి, తిరుపతి : పెద్ద మనుషులు పంచాయితీ చేసినా కాపురానికి రాలేదనే కక్షతో భార్యను హత్య చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివప్రసాద్‌రెడ్డి తెలిపిన వివరాలు.. అనంతపురం జిల్లా, గుంతకల్లు చెందిన శివయ్య, వాణి అలియాస్‌ ఓబులమ్మ(38)కు  20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2015లో దంపతులిద్దరూ బతుకుదెరువు కోసం తిరుపతి చేరుకున్నారు. తొలుత చెర్లోపల్లెలో నివాసమున్నారు. శివయ్య ఆటోడ్రైవర్‌గా పని చేయసాగాడు. అయితే శివయ్యకు భార్యపై అనుమానం పెరిగింది. ఆ తర్వాత తన పిల్లలను తీసుకుని గుంతకల్లుకు వెళ్లిపోయాడు.

అయితే వాణి మాత్రం స్థానిక ఆర్‌సి రోడ్డు సమీపంలోని శివాజీ నగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసముంటోంది. 15 రోజుల క్రితం పెద్దమనుషులు మధ్యస్తం చేశారు. దంపతులిద్దరూ కలిసి ఉంటూ పిల్లలను చూసుకోవాలని హితవు పలికారు. దీంతో శివయ్య గురువారం రాత్రి భార్యను తీసుకువెళ్లేందుకు తిరుపతికి వచ్చాడు. తనతో పాటు రావాలని తన భార్యను శుక్రవారం ఉదయం కోరాడు. అయితే ఆమె నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో తనతో వచ్చేందుకు అయిష్టత చూపుతోందని మండిపడ్డాడు. గొంతు నులిమి ఆమెను హతమార్చాడు. మధ్యాహ్నం స్థానికుల సమాచారంతో ఈస్టు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వాని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది చదవండి :  క్షణికావేశం..పోయిందో చిన్నారి ప్రాణం

మరిన్ని వార్తలు