న్యూఢిల్లీ : భార్యాభర్తల మధ్య చోటుచేసుకున్న గొడవలో తలదూర్చినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తమ భార్యాభర్తల గొడవలో పరాయి వ్యక్తి కలుగజేసుకోవటం నచ్చని భర్త యువకుడిని కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన దక్షిణ ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్లో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సంజీవ్ పాండే అనే వ్యక్తి గ్రేటర్ కైలాస్ దగ్గరలోని జమ్రుద్పూర్లో తన బంధువు అజిత్తో కలిసి ఓ రూములో ఉంటున్నాడు. అక్కడే ఓ టీ షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం అతడి రూము పక్కనే ఉండే జితిన్ బోరా దంపతులు గొడవపడటం అతడి కంటపడింది. దీంతో అతడు వారి వద్దకు వెళ్లి గొడవ పడొద్దని సర్థిచెప్పే ప్రయత్నం చేశాడు. వారు వినకపోయేసరికి రూముకు తిరిగి వచ్చి నిద్రపోయాడు. తమ భార్యాభర్తల గొడవలో పరాయి వ్యక్తి కలుగజేసుకోవటం నచ్చని జితిన్ సంజీవ్పై ఆగ్రహించాడు.
కత్తి చేతపట్టుకుని సంజీవ్ రూముకు వెళ్లాడు. అనంతరం నిద్రపోతున్న అతడి ఛాతిలో.. తొడలో గట్టిగా పొడిచాడు. కత్తిగాట్ల కారణంగా సంజీవ్ కేకలు పెట్టడంతో జితిన్ అక్కడినుంచి పరుగులు తీశాడు. అరుపులు వినపడి అక్కడకి చేరుకున్న అజిత్, పొరుగిళ్ల వారు సంజీవ్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకురావటానికి మునుపే అతడు మరణించినట్లు వైద్యులు తెలిపారు. అజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న జితిన్ కోసం గాలిస్తున్నారు.