సాక్షి, చెన్నై : మాట్లాడలేని మూగరాలైన కుమార్తె కామాంధుడి చేతిలో అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకోవడంతో అందుకు కారకుడైన ఆ కాముకుడిని హత్య చేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్న తండ్రి ఉదంతం శుక్రవారం తేని జిల్లాలో చోటు చేసుకుంది. చిన్నమనూర్ సమీపం సేలయాంపట్టి గ్రామానికి చెందిన కోచ్చడయాన్ మూగరాలైన తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నాడు. భార్య లేకపోవడంతో తల్లిదండ్రి కూడా తానే అయ్యి ఎంతో గారాబంగా పెంచేవాడు. అయితే, తన గారాలపట్టికి యముడు ఇంట్లోనే ఉన్నాడని ఆయన తెలుసుకోలేకపోయాడు. 2013 కుమార్తెను ఇంట్లో ఒంటరిగా ఉంచి పనికి వెళ్లాడు. ఇతిని ఇంటికి వచ్చి చూడగా కుమార్తె అత్యాచారానికి గురైంది. పక్కింటిలో నివసించే రత్నవేల్ పాండియన్ అనే యువకుడు ఆ బాలికపై అత్యాచారం చేసి పారిపోయాడు.
తనపై జరిగిన అఘాయిత్యానికి తీవ్రంగా కృంగిపోయిన ఆ బాలిక బయటకు చెప్పుకోలేక ఇల్లు వదిలి పారిపోయి ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్యకు కారణమైన రత్నవేల్ పాండియన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. నిందితుడు రత్నవేల్ పాండియన్ ఏడేళ్ల తర్వాత బెయిల్పై జైలు నుంచి బయటకు రాగా, అతని కోసమే ఆక్రోషంతో ఎదురుచూస్తున్న కోచ్చడయాన్ శుక్రవారం హతమార్చి పారిపోయాడు. కుమార్తె మరణానికి కారకుడైన నిందితుని చంపి ప్రతీకారం తీర్చుకున్నాననే సంతోషంతో జైలుకు పోతున్నానని కోచ్చడయం పేర్కొన్నాడని పోలీసులు తెలిపారు.