రెండో భార్యను చంపి ముక్కలు చేసిన భర్త

18 Apr, 2018 11:31 IST|Sakshi
నిందితుడు పట్టుబడ్డ ఉద్నా కాలువ ప్రదేశం

సూరత్‌: మొన్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసిన ఘటన మరువక ముందే.. కట్టుకున్న భార్యను హత్య చేసి పాశవికంగా ముక్కలుగా చేశాడో భర్త. ఈ పైశాచిక ఘటన సూరత్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. భార్యను హతమార్చి అనంతరం ఆమె శరీర భాగాలను ఉద్నాలోని కాలువలో పడేస్తుండగా నిందితున్ని పోలీసులు రెడ్‌-హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..  షానవాజ్‌ అలియాస్‌ షానూ యూసుఫ్‌మియా షైక్‌ (32) పార్సీ షెరీలోని రాణి తలావ్‌లో సరుకు రవాణా దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. అక్కడే తన భార్య జొహ్రాబ్‌ నబీతో పాటు నివాసముంటున్నాడు.

రెండేళ్లక్రితం  షానవాజ్‌ అమ్రావతికి చెందిన జులేఖతో ప్రేమాయణం సాగించి ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు భార్యలతో ఒకే ఇంట్లో కాపురం పెట్టాడు. అయితే మొదటి భార్య జొహ్రాబ్‌ నబీకి, జులేఖకి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన షానవాజ్‌ ఎలాగైనా తన రెండో భార్య జులేఖ అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఆదివారం రాత్రి ఆమెను చంపి, శరీరాన్ని 11 ముక్కలుగా చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా భతేనా ఖడీలోని ఉద్నా కాలువలో పడేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు.

అతని మొదటి భార్య, సోదరి ఈ హత్యలో అతనికి సహాయపడొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీకి పరారైన ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కాగా​, నిందితుని కుటుంబ సభ్యులందరినీ అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. సూరత్‌ ఏసీపీ (రేంజ్‌-1) హెచ్‌కే పటేల్‌ మాట్లాడుతూ.. ‘ షానవాజ్‌ తన రెండో భార్యను ముక్కలుగా కోసి ఆమె శరీర భాగాలను కాలువలో పడేస్తుండగా రెడ్‌-హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. అతనిపై మర్డర్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశాం’అని తెలిపారు.

మరిన్ని వార్తలు