తాళ్లతో కట్టేసి..ఊపిరాడకుండా దిండుతో నొక్కి..!

6 Dec, 2019 20:48 IST|Sakshi

ముంబై: దేశవాణిజ్య రాజధాని ముంబైలోని గోరెగావ్‌లో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసై రోజు కుటుంబసభ్యులను చిత్రహింసలకు గురిచేస్తున్న రాజు వాగ్మేర్ అనే వ్యక్తిని గురువారం రోజున తన ఇద్దరు భార్యలు పథకం ప్రకారం హతమార్చారు. రాజు 2006లో సవితను వివాహం చేసుకోగా.. 2010లో సరితను వివాహం చేసుకున్నాడు. వీరిలో సవితకు ముగ్గురు పిల్లలు కాగా.. సరితకి ఒకరు సంతానం. రాజు వాగ్మేర్ తన ఇద్దరు భార్యలు, నలుగురు పిల్లలతో కలిసి ఒకే ఇంట్లోనే ఉంటున్నారు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేస్తున్న వాగ్మేర్‌ గతకొద్ది రోజులుగా ఉద్యోగం మానేసి ఇంట్లోనే కూర్చొని మద్యం తాగుతూ గడిపేవాడు. ఈ క్రమంలో భార్యలిద్దరినీ, పిల్లలను వేధింపులకు, హింసకు గురిచేస్తుండటంతో వారు భర్త ప్రవర్తన పట్ల విసిగిపోయారు. ఎలాగైనా రాజును హతమార్చాలని పథకం వేశారు. సరిత, సవిత గురువారం అర్ధరాత్రి భర్తను హతమార్చడానికి అనువైన సమయంగా ఎంచుకున్నారు.

అర్ధరాత్రి ఒంటి గంటకు మద్యం మత్తులో ఉన్న రాజును మంచం మీద పడుకోబెట్టారు. కదలకుండా కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశారు. దిండుతో ముఖంపై అదిమిపట్టి ఊపిరి ఆడకుండా బిగించారు. దీంతో కొద్ది సేపటిలోనే అతను మృతి చెందాడు. వెంటనే వారు తమకేమీ తెలియనట్టు.. రాజు స్పందించడం లేదని మృతుడి అన్న వినోద్‌కు ఫోన్ చేశారు. అక్కడికి చేరుకున్న వినోద్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో వైద్యులు చనిపోయాడని ధ్రువీకరించారు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో విచారణ మొదలుపెట్టారు. ప్రాథమిక విచారణలో ఇద్దరు భార్యలు కలిసి హతమార్చారని తెలిసింది. వారిని అరెస్టు చేయడంతో పాటు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

చదవండి: 9 నెలల చిన్నారిపై మేనమామ అఘాయిత్యం

మరిన్ని వార్తలు